టార్గెట్ బీజేపీ.. కాంగ్రెస్‌తో పొత్తుకు CM KCR ప్లాన్?

by Disha Web Desk 2 |
టార్గెట్ బీజేపీ.. కాంగ్రెస్‌తో పొత్తుకు CM KCR ప్లాన్?
X

దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర విషయం చోటుచేసుకోబోతుందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కూటమితో జత కట్టేందుకు పావులు కదుపుతున్నదా? ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కీలకపాత్ర పోషిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరించిన కేసీఆర్‌కు.. ఆ పార్టీ కూటమితో కలిసే అవసరం ఏమొచ్చింది? ఇంతకు కేసీఆర్ ఆ కూటమిలో కలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రాష్ట్ర నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా?

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగానే యాంటీ బీజేపీ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. మొదట్లో మూడో కూటమి దిశగా ప్రయత్నాలు చేసినా.. తర్వాత దానికి బ్రేక్ పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గాలను వైపు కేసీఆర్ అన్వేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​కూటమిలో చేరేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌‌ పార్టీకీ కేసీఆర్ తీరని నష్టం చేశారని హస్తం కూటమి ఆగ్రహంతో ఉంది. కానీ, అదే పార్టీలోని ఓ కీలక నేతతో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కూటమిలో చేర్చేందుకు రాయబారం ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో టాక్. కిందిస్థాయిలో కేసీఆర్‌కు అంతగా సాయం చేసే నేతలెవ్వరూ కాంగ్రెస్‌లో లేరు. దీంతో కేసీఆర్ చిరకాల మిత్రుడు కేవీపీ రామచంద్రారావు మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాకు మాట ఇచ్చినా.. దానిని నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడంపై ఫోకస్ పెట్టారు. మరో వైపు పార్టీ విస్తరణలో భాగంగా ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును సైతం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో బీజేపీ సైతం తెలంగాణపై కన్నేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీఆర్‌ఎస్​నేతలను, ప్రజాప్రతినిధులను టార్గెట్​చేయడం మొదలుపెట్టింది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలు సైతం దాడులు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్​స్కాంలో కేసీఆర్​కూతురు, ఎమ్మెల్సీ కవితకు సైతం నోటీసులు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో యాంటీ బీజేపీ కూటమి సాయం తప్పకుండా అవసరమని కేసీఆర్ గుర్తించారని గులాబీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​కూటమి ప్రత్యామ్నాయంగా మారిందని కేసీఆర్​భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొవడం, కేసుల నుంచి బయటపడటం కోసం కాంగ్రెస్​కూటమే ప్రత్యామ్నయమనుకున్న గులాబీ బాస్.. అందులో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కేవీపీ కీ రోల్!

కేవీపీ రామచంద్రరావు, కేసీఆర్ మధ్య 8 ఏండ్లుగా దోస్తీ కొనసాగుతూనే ఉంది. ఆయన నిర్మాణ కంపెనీకి కేసీఆర్ టెండర్లు ఇస్తూనే ఉన్నారు. ఆపద సమయాల్లో కేసీఆర్‌కు కేవీపీ ఏదో రూపంలో సాయం చేస్తున్నారని రాజకీయవర్గాల్లో టాక్. కేసీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక టీడీపీ, కాంగ్రెస్‌లోని వెల్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను సీఎంకు​దగ్గర చేయడంలో కేవీపీదే కీలక పాత్ర అని ప్రచారం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కేవీపీ మళ్లీ సాయం చేస్తున్నట్టు టాక్. సోనియాగాంధీతో మాట్లాడేందుకు కేవీపీ లాబీయింగ్​మొదలుపెట్టారని సమాచారం. 'ప్రస్తుతం కాంగ్రెస్​ లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మడం లేదు. కానీ, కేవీపీ ఆ బాధ్యత తీసుకుని, కాంగ్రెస్​కూటమిలో బీఆర్‌ఎస్​ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు, కాంగ్రెస్​లోని ఒక వర్గానికి అసలు పడదు. కానీ, కేవీపీ ఎంటరైన తర్వాత అదంతా ఉండదు.

త్వరలోనే కాంగ్రెస్ కూటమిలో కేసీఆర్​ప్రస్తావన వచ్చే చాన్స్​ఉంది..' అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్​నేత వెల్లడించారు. దీంతో ఢిల్లీ వేదికగా అంతర్గత చర్చలు మొదలైనట్టు స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్..​ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, బీఆర్‌ఎస్‌తో అసలే ఉండదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టీపీసీసీ చీఫ్​రేవంత్‌రెడ్డికి, బీఆర్‌ఎస్​నేతల మధ్య నిత్యం వివాదాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్​సైతం రేవంత్​వ్యవహారంలో చాలా సీరియస్‌గానే ఉంటున్నారు. కాంగ్రెస్‌లోని ఒక వర్గం కేసీఆర్‌కు కోవర్టులు అనే ప్రచారం రెండు పార్టీలోనూ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​కూటమిలో కేసీఆర్​చేరితే.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. వీరి మధ్య సయోధ్య కుదర్చడం సైతం కేవీపీ భుజాలపైనే వేసినట్టు టాక్. ఇప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్​నేతలంతా కేవీపీ ఏం చెప్తే అదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన సమయంలో కేవీపీ వచ్చి పార్టీలో చక్రం తిప్పి వెళ్తున్నారు. తాజాగా సీడబ్ల్యూసీ నేత దిగ్విజయ్​రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, రేవంత్​మధ్య నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్రానికి వచ్చారు. అదే సమయంలో కేవీపీ సైతం రావడంతో అంతా ఓ క్లారిటీకి వచ్చారని పార్టీ వర్గాల్లో టాక్. అంతే కాకుండా సీడబ్ల్యూసీలోని కీలక నేతలంతా కేవీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. దీంతో కాంగ్రెస్ కూటమిలో బీఆర్ఎస్‌ను​చేర్చడంలో కేవీపీ లాబీయింగ్​సక్సెస్​అవుతుందనే టాక్ వినిపిస్తున్నది.

Also Read...

BRS విస్తరణలో కాంగ్రెస్ కీలక నేత.. కేసీఆర్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ షురూ!?​



Next Story

Most Viewed